దొరికింది వారు కాదటా...ఇంకోకరు అటా....విమర్శలకు తావిస్తున్న పోలీసుల తీరు

byసూర్య | Mon, Jan 30, 2023, 05:42 PM

రాచకొండ కమిషనరేట్ పోలీసుల తీరుపై తాజాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ జిల్లాలోని పిర్జాదిగూడ పేకాట కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ బీఆర్ఎస్ నేతలను పోలీసులు తప్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు పట్టుబడిన ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు తప్పించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా కంట పడకుండా పోలీసులు గుట్టుగా తప్పించారని చెబుతున్నారు.


పిర్జాదిగూడ డిప్యూటీ మేయర్ ఫాంహౌస్‌లో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతూ డిప్యూటీ మేయర్‌తో పాటు ఆరుగురు కార్పొరేటర్లను రెడ్ హ్యాండెడ్‌గా ఎస్‌ఓటీ పోలీసులకు దొరికిపోయారు. మొత్తం 15 మంది స్పాట్‌లో దొరకగా.. ఎస్‌ఓటీ పోలీసులు కేవలం కొందరిని మాత్రమే అరెస్టు చూపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను మాత్రం తప్పించినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు బయటకు పరుగులు పెడుతున్న క్రమంలో.. కవర్ చేసేందుకు వచ్చేందుకు మీడియాపై నాయకులు దాడికి దిగారు. రోడ్డుపై హంగామా సృష్టించి మీడియా ప్రతినిధులపై దాడులకు పాల్పడ్డారు. మీడియాపై దాడి చేస్తూనే డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు కారులో ఎక్కి వెళ్ళిపోయారు.


ఇంత జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు స్థానంలో వారి డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు కార్యకర్తలు, బయటనుండి ఇద్దరు డ్రైవర్ అరెస్టు చూపిస్తున్నారు. దీంతో రాచకొండ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావాలని విద్యుత్ సరఫరా నిలిపివేసి బీఆర్ఎస్ నేతలను తప్పించే ప్రయత్నం పోలీసులు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రత్యర్థి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలు కావడం వల్లే పోలీసులు సపోర్ట్‌గా ఉంటున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు, కొంతమంది స్థానికులు విమర్శలు చేస్తున్నారు.


పేకాట స్థావరంపై నిర్వహించిన దాడిలో భారీ మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో నగదు పెట్టి పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతోనే పోలీసులు దాడి చేయగా.. స్థానికులే సమాచారం ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. ఈ దాడిలో పేకాట ఆడుతున్న బిల్డర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా వీళ్లు గ్రూపుగా ఏర్పడి పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్ నేతలు పేకాట ఆడుతూ పట్టుబడటం స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు పలువురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంతకాలం నుంచి పేకాట జరుగుతుంది? అనే వివరాలను స్థానికుల నుంచి సేకరిస్తున్నారు.



Latest News
 

నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM
ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి Sat, Apr 20, 2024, 01:04 PM