byసూర్య | Wed, Jan 25, 2023, 11:18 AM
సచివాలయానికి సృజనాత్మకంగా తుది మెరుగులు దిద్దండి. ఇంటీరియర్, గోడలకు ఏర్పాటు చేస్తున్న కళాకృతుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రాంగణమంతా ఆహ్లాదకర వాతావరణాన్ని ఆవిష్కరించండి. సందర్శకులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు ఉండాలి. ఆధునిక ఫర్నిచర్ను ఉపయోగించండి. పనులు త్వరగా పూర్తిచేయండి. అన్నింటినీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తుదిదశలో ఉన్న సచివాలయం పనులను మంగళవారం ఆయన క్షుణ్నంగా పరిశీలించారు. పనులు సాగుతున్న తీరుపై సంతృప్తి వ్యకం చేశారు. భవనంపై ఏర్పాటుచేసిన డోములు, జాతీయ చిహ్నమైన మూడు సింహాలకు మెరుగైన రంగులు వేయాలని సూచించారు. తన కార్యాలయంతో పాటు అంతటా నాణ్యతకు పెద్దపీట వేయాలని సూచించారు.
బ్యాంకులు, క్యాంటీన్, ఏటీఎం, మీడియా సెంటర్, సందర్శకుల కోసం చేపడుతున్న నిర్మాణాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఆలయం, మసీదు, చర్చి నిర్మాణ పనుల గురించి ఆరా తీశారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫౌంటెన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటుచేసిన ఆరో అంతస్తులోని కిటికీల నుంచి ప్రాంగణాన్ని పరిశీలిస్తూ హుస్సేన్సాగర్ తీరంలో నిర్మాణంలో ఉన్న పలు కట్టడాలను వీక్షించారు. అంతర్గత రహదారుల వెడల్పు, వాటి నిర్మాణం సిమెంటుతోనా, తారుతోనా అని అడిగినట్లు సమాచారం. రక్షణ, అగ్నిమాపక వ్యవస్థ, ఏసీ ప్లాంటు, జనరేటర్ వ్యవస్థ గురించి వివరాలు తెలుసుకున్నారు.