byసూర్య | Tue, Jan 24, 2023, 02:53 PM
రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధన దిశగా ముందడుగు పడింది. కరీంనగర్ జిల్లాకు 100 MBBS సీట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాత్కాలిక గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం 7కోట్లు మంజూరు చేసింది. మంగళవారం కరీంనగర్లో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలే ఉన్నాయి. ఇందులో ఉస్మానియా, గాంధీ దవాఖానలు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేకన్నా ముందే స్థాపించారు. అంటే. 60 ఏండ్లలో తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం మూడు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మొదటి విడతలో ప్రభుత్వం మహబూబ్నగర్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో నాలుగు, రెండో విడుతగా. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో 8 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. వీటిల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు మూడోవిడతగా మరో 8 వైద్య కాలేజీలు మంజూరుచేసింది. తద్వారా రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 25కు పెరుగనున్నది. ఇందులో 20 కాలేజీలను ఎనిమిదేండ్లలోనే ఏర్పాటుచేయడం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం.