byసూర్య | Thu, Dec 08, 2022, 10:59 AM
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి ప్రజాప్రతినిధులు, అధికారులు కలసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ల్యాంకోహిల్స్ రోడ్డులో 5 కోట్లతో నూతన మున్సిపల్ కార్యాలయం భవనానికి ఆయన మున్సిపల్ చైర్మెన్ కె. నరేందర్ ముదిరాజ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మరో కోటితో అలకాపూర్ టౌన్ షిప్ లో బీటీ రోడ్లు, సాయిరాంనగర్ కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించారు. అనంతరం కొత్తగా కొనుగోలు చేసిన మున్సిపల్ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మున్సిపాలిటీల పరిధిలో పెరుగుతున్న ప్రజలకు అనుగుణంగా సమస్యలు పెరుగుతున్నాయన్నారు. వారికి అత్యవసరమైన రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీరు, రవాణా సదుపాయాలు, మార్కెట్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలాంటి సౌకర్యాలన్నింటినీ కల్పించేందుకు కృషి చేయాలన్నారు.