![]() |
![]() |
byసూర్య | Mon, Dec 05, 2022, 11:47 PM
కొడంగల్ నియోజకవర్గానికి నిధులు వచ్చుడో, లేదా ఎమ్మెల్యే సచ్చుడో తేలాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన చేయాలని... లేకపోతే నియోజకవర్గంలో గ్రామగ్రామాన తిరిగి టీఆర్ఎస్ ను ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ నియోజకవర్గానికి తుప్పు పట్టిందని ఆయన విమర్శించారు. డ్రామారావు (కేటీఆర్) దత్తత తీసుకోవడం వల్లే కొడంగల్ కు ఈ పరిస్థితి పట్టిందని ఎద్దేవా చేశారు. 2019 జనవరి 1 నుంచి కొడంగల్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారని... ఈ నాలుగేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. కొడంగల్ కు అభివృద్ధి నిధులు వచ్చేంత వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరాహారదీక్ష చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు టీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పన్నాయని రేవంత్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను గాంధీ కుటుంబం గౌరవించిందని... కానీ బీజేపీ, టీఆర్ఎస్ నేతలు తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, బీజేపీ నేత బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేవలం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో తప్ప మరే ప్రాజెక్టుతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. మిగిలిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవే అని చెప్పారు.