byసూర్య | Wed, Nov 30, 2022, 02:22 PM
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాల్లో పరిస్ధితులు దయనీయంగా ఉండేవని, పిల్లలు చర్మ వ్యాధులతో బాధ పడే పరిస్థితి ఉండేదని. పురుగులు పడిన దొడ్డు అన్నం, నీళ్ల చారు తినలేక పిల్లలు కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేసుకున్నారు. సమైక్య పాలకులు విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేశారని ఆయన అన్నారు. దేవరకద్రలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల డిగ్రీ కళాశాల (MJPTBCW RDC for Boys) ను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. తాను కూడా ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదువుకున్నానని, పదో తరగతి పరీక్షలు రాసేందుకు వస్తే దేవరకద్రలో ఉండేందుకు కనీసం వసతి కూడా లభించక మసీదులో ఉండి పరీక్షలు రాశానని ఆనాటి ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మాత్రం సీఎం కేసీఆర్ కేజీ నుంచి పీజీ వరకు కూడా సకల సదుపాయాలతో ఉచిత గురుకులాలు అందిస్తున్నారని తెలిపారు. 70 ఏళ్లలో పేదలకు మెరుగైన విద్య అందక అనేక ఇబ్బందులు పడ్డామని అన్నారు. దేశంలోనే అత్యున్నత గురుకుల విద్యను అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
ఉద్యమ సమయంలోనే ఈ రాష్ట్రానికి ఏం కావాలో మేధో మథనం చేసిన ఉద్యమ నేత. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని అమలు చేసి ఊహించని విధంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత గురుకుల విద్యను అందించడమే ఆయన సంకల్పమని ఆ దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి అన్నారు. తెలంగాణ వచ్చాకే దివ్యాంగులకు న్యాయం జరిగిందని. వారికి రూ. 3016 పింఛన్ అందిస్తూ అండగా ఉంటున్నామని తెలిపారు. వ్యవసాయానికి సరైన కరెంటు సాగునీరు అందక సమైక్య రాష్ట్రంలో మన జిల్లా నుంచి భారీగా వలసలు ఉండేవని. ఇప్పుడు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సాగునీటి లభ్యత వల్ల బంగారు పంటలు పండుతున్నాయన్నారు. చెక్ డ్యాముల కింద ఎండాకాలం కూడా సాగునీరు లభిస్తోందన్నారు. అన్నారు వలసలు తగ్గి స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు.
సమైక్య రాష్ట్రంలో పదవులు అనుభవించిన తెలంగాణ నాయకులు ఇప్పుడు ప్రజలు పట్టించుకోకపోవడంతో జీర్ణించుకోలేక అనేక కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రి విమర్శించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పిండి సంచుల కోసం క్యూ లైన్ లలో నిలబడే 17 మంది మృత్యువాత పడ్డారని, తెలంగాణలో మాత్రం అన్నదాతలకు ఏ కష్టం లేకుండా ఎరువులను అందుబాటులో ఉంచిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. అన్ని ధరలు పెంచుతూ పోతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలకు సహకారం అందించకపోగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలపై కుట్రలు చేస్తోందని మంత్రి విమర్శించారు. ఈ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నాలని ఆయన కోరారు.
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర డిగ్రీ కళాశాలను వెనుకబడిన దేవరకద్రలో ఏర్పాటు చేసేందుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, డా వి శ్రీనివాస్ గౌడ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర రెడ్డి తెలిపారు. విద్యార్ధులు కష్టపడి చదివి జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాక్షించారు. రాష్ట్రం ఏర్పడటం వల్లే వెనకబడిన ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు.
కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్, జడ్పీటిసి అన్నపూర్ణ శ్రీకాంత్, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు, ప్రిన్సిపల్ అమరేశ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.