byసూర్య | Thu, Nov 24, 2022, 08:56 AM
సాధించాలన్న తపన, పట్టుదల ఉంటే అంగవైకల్యం విజయానికి అడ్డుకాదని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా మహిళా శిశు వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులకు నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజర్షిషా మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఆత్మస్తైర్యం నింపడానికి క్రీడా పోటీలు దోహదపడుతాయన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన ప్రథమ విజేతలను హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. పరుగు పందెం, షాట్పుట్, జావెలిన్త్రో, ట్రై సైకిల్ రేసు, క్యారం, చెస్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.