byసూర్య | Mon, Oct 03, 2022, 02:04 PM
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉచిత చేప పిల్లల పంపిణీ విజయవంతంగా చేస్తున్నామని, ఈ కార్యక్రమం వల్ల తెలంగాణలో మత్స్య సంపద భారీగా పెరిగిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కుల వృత్తులు అంతరించిపోకుండా కాపాడుతూ వాటిని కాపాడడమే కాకుండా ఆ వృత్తుల ద్వారా జీవన ప్రమాణాలు పెరిగేలా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ఎంతో గొప్పదని మంత్రి పేర్కొన్నారు. మహబుబ్ నగర్ రూరల్ మండలం కోడూరు చెరువులో 42 వేల ఉచిత చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకప్పుడు చెరువులు ఎండిపోయి కళా విహీనంగా ఉండేవని ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో ఉన్న 1086 చెరువులలో రూ. 114. 53 లక్షల నిధులతో 190. 16 లక్షల చేప పిల్లలను వదులుతున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్చార్జి యం. సత్యనారాయణ, జిల్లా మత్స్య శాఖ ఆధికారి డి. రాధ రోహిణి, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ మల్లు నరసింహా రెడ్డి, జడ్పిటిసి వెంకటేశ్వరమ్మ, యంపీటీసీ రవీందర్ రెడ్డి, వైస్ యంపీపీ అనిత, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, డీసీసీబీ డైరెక్టర్ నర్సింహులు, మత్స్య శాఖ సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.