byసూర్య | Wed, Sep 28, 2022, 07:58 PM
తెలంగాణ రాష్ట్ర డీజీపీ పేరుతో వస్తున్న ట్రాఫిక్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ వివరణ ఇచ్చారు. ఇదిలావుంటే తెలంగాణ డీజీపీ వాహనంపై రూ. 7 వేల చలానా పెండింగ్ లో ఉందనే వార్త ట్విట్టర్ లో వైరల్ అయింది. ఆయన ఫైన్ చెల్లించారా? లేదా? అంటూ నెటిజెన్లు పెద్ద సంఖ్యలో కామెంట్లు చేశారు. ఈ అంశంపై ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వివరణ ఇచ్చారు. తెలంగాణలోని పోలీస్ వాహనాలన్నీ 2018 నుంచి డీజీపీ పేరిట మాత్రమే రిజిస్టర్ అవుతున్నాయని ఆయన తెలిపారు. అందుకే ఏ పోలీస్ వాహనంపై ఫైన్ విధించినా డీజీపీ పేరిటే వస్తుందని చెప్పారు.
ఇప్పటివరకు పోలీసుల వాహనాలపై ఉన్న 11,601 చలానాలకు సంబంధించి రూ. 28.85 లక్షలను ఆయా అధికారులు చెల్లించారని తెలిపారు. ట్విట్టర్ లో వైరల్ గా మారిన రూ. 6,945 చలానాను కూడా సదరు అధికారి చెల్లించేశారని చెప్పారు. ఆర్టీసీ అధికారులు కూడా ఈ ఏడాది ఏప్రిల్ వరకు రూ. 15 లక్షల చలానా డబ్బులు చెల్లించారని తెలిపారు. ట్రాఫిక్ అధికారులు సైతం చట్టానికి కట్టుబడి ఉంటారని చెప్పారు.