byసూర్య | Thu, Sep 22, 2022, 08:59 PM
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవిలో రాహుల్ గాంధీయే ఉండాలన్న డిమాండ్ ఆ పార్టీలో తీవ్రంగా పెరుగుతోంది. ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ... ఆ పార్టీకి చెందిన తెలంగాణ శాఖ (టీపీసీసీ) ఓ కీలక తీర్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీయే ఉండాలని టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు హైదరాబాద్లో టీపీసీసీ ప్రత్యేకంగా సమావేశమై... తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని పార్టీ అధిష్ఠానానికి పంపనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశంలో విద్వేష రాజకీయాలకు రాహుల్ గాంధీ నాయకత్వంలోనే చరమ గీతం పాడగలమని గట్టిగా నమ్ముతున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ ఇప్పటికే 7 రాష్ట్రాల పీసీసీలు తీర్మానాలు చేశాయి. తాజాగా తెలంగాణ పీసీసీ కూడా తీర్మానం చేయడంతో ఈ దిశగా తీర్మానాలు చేసిన రాష్ట్రాల సంఖ్య 8కి చేరింది.