byసూర్య | Thu, Sep 22, 2022, 08:58 PM
ఏపీలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును మార్పు సరికాదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తప్పుపట్టారు. ఇలా పేర్లు మార్చడం సరికాదని ఆమె అన్నారు. పేర్లు మారిస్తే దానికున్న విలువ పోతుందని చెప్పారు. ఏవో కారణాల వల్ల ఒక పేరు పెడతారని... ఆ పేరును అలాగే కొనసాగిస్తే తరతరాలుగా వారికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుందని అన్నారు. జనాల్లో కన్ఫ్యూజన్ ను పోగొట్టినట్టు ఉంటుందని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే... ఎవరు ఏం చేస్తున్నారో కూడా జనాలకు అర్థంకాకుండా పోతుందని అన్నారు. తన పాదయాత్ర సందర్భంగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయనను కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని షర్మిల మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తన తండ్రి పేరును వాడుకుంటారని... ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోతారని విమర్శించారు. వైఎస్సార్ కు తానే అసలైన రాజకీయ వారసురాలినని... కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పారు.