byసూర్య | Wed, Aug 17, 2022, 12:47 PM
ములుగు జిల్లాలో ఇసుక జీరో దందా జోరుగా కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇసుక క్వారీలు తాత్కాలికంగా బంద్ అయ్యాయి. దీంతో మార్కెట్లో ఇసుకకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఎలాంటి అను మతులు లేకుండానే లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. డీడీలు, వే బిల్లులు లేకుండా బల్క్ ఆర్డర్లు అంటూ పదుల సంఖ్యలో లారీల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇదంతా రెవెన్యూ, టిఎస్ఎండిఎస్ అధికారుల అండదండలతోనే కొసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రిపగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక లారీలను చెక్ పోస్టులు దాటిస్తున్నారు. ఇసుక మాఫియా ఓ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం సబ్ డివిజన్ లోని మండలాల వారీగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని లారీకి ఇంత చొప్పున అధికారులకు మామూళ్లు ముట్టజెబుతున్నట్లు సమచారం. దీంతో అన్ని తెలిసినా చూసీచూడనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పలు గ్రామాల ప్రజలు లారీలను అడ్డుకుంటే టిఎస్ఎండిసి నుంచి బల్క్ఆర్డర్లు అంటూ తప్పుదోవ పట్టిస్తూ ఇసుక రవాణ సాగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టిసారించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఇసుక మాఫియాపై ఉక్కపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.