byసూర్య | Sat, Aug 06, 2022, 12:05 PM
నార్కట్ పల్లి మండలం బ్రహ్మణవెల్లంలకు చెందిన నిమ్మల లింగస్వామి(32) పై గురువారం మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు పిస్తోలుతో కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడనే నెపంతో లింగస్వామిని అంతమొందించాలనే ఉద్దేశంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి సుపారీ వ్యక్తులతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దిశగా పోలీసులు సైతం దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోని నల్గొండలోని టాస్క్ ఫోర్స్ బృందం విచారణ చేస్తున్నట్లుగా విశ్వసనీయ పోలీసుల వర్గాల నుంచి సమాచారం తెలిసింది. బాధితుడు లింగస్వామి భార్యను పిలిపించి పోలీసులు విచారణ చేపడుతున్నట్లుగా తెలిసింది.
నిందితులు ఉపయోగించిన పిస్తోలు ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలానికి చెందిన గిరిబాబు, రామలింగంపై కేసు సైతం నమోదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులతో పాటు సుపారీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగి, బాధిత లింగస్వామి భార్య ఉన్నట్లుగా సమాచారం. కాగా నెల రోజుల క్రితమే లింగస్వామిని పిస్తోలుతో బెదిరించడంతో బాధితుడు ప్రతిఘటించడంతో ప్రాంక్ వీడియోగా నమ్మబలికించారని.. వారే ఈ దాడికి పాల్పడ్డారని లింగస్వామి, పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ కాల్పుల ఘటనపై జిల్లా ఎస్సీ రెమా రాజేశ్వర్ విచారణ చేపడుతున్నట్లు సమాచారం. నార్కట్పల్లి కామినేని ఆసుపత్రిలో లింగస్వామికి శస్త్ర చికిత్స చేసి శరీరం నుంచి రెండు తూటాలను బయటికి తీశారు. క్షతగాత్రుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.