byసూర్య | Sat, Aug 06, 2022, 12:00 PM
ఇంటి వద్ద తప్పిపోయిన తొమ్మిదేళ్ల బాలిక ఎటెళ్లాలో తెలియక లింగంపల్లి రైల్వేస్టేషన్ లో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కింది. రైలు సికింద్రాబాద్ వైపు బయలుదేరింది. సమాచారమందుకున్న సికింద్రాబాద్ జీఆర్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను బాలికను సికింద్రాబాద్ స్టేషన్లో గుర్తించారు. బీహెచ్ఈఎల్కు చెందిన వెంకటేష్, రేఖ దంపతుల కుమార్తె మోక్షిత స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది.
ఈనెల 5న ఇంటి వద్ద కనిపించకుండాపోయింది. తల్లిదండ్రులు పోలీసులకు, తెలిసిన వారికి సమాచారమిచ్చారు. ఓ వైపు వారు గాలిస్తుండగానే సికింద్రాబాద్ రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనుకు సమాచారం అందింది. సికింద్రాబాద్ స్టేషన్లో అన్ని రైళ్లను సిబ్బందితో ఆయన తనిఖీ చేశారు. నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో బాలిక కనిపించింది. ఆమెను వివరాలు అడగగా. ఇంటి నుంచి తప్పిపోయి. లింగంపల్లి స్టేషన్కు చేరుకున్నానని, ఎక్కడికి వెళ్లాలో తెలియక నారాయణాద్రి రైలు ఎక్కానని చెప్పింది. బాలికను సికింద్రాబాద్ రైల్వే చైల్డ్ లైన్(ది వ్యదిశ సంస్థ) హెల్ప్ డెస్క్ సెంటర్లో అప్పగించి తల్లిదండ్రులకు సమా చారం ఇచ్చారు. వారొచ్చిన తరువాత బాలికను అప్పగించారు.