byసూర్య | Sat, Aug 06, 2022, 03:33 AM
చదవు చెప్పాల్సిన స్కూళ్లలో కొందరు ఉపాధ్యాయులు పెడుతున్న స్వీయ నిబంధనలు విద్యార్థుల ప్రాణాలపైకి తెచ్చిపెడుతోంది. తాజాగా రెండు జడలకు బదులుగా ఒక్క జడ ఎందుకు వేసుకొచ్చారంటూ విద్యార్థినులతో 200 గుంజీల చొప్పున తీయించిందో పీఈటీ టీచర్. దీంతో అలా తీసినవారంతా అస్వస్థతకు గురయ్యారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిందీ ఘటన. గుంజీల కారణంగా 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాళ్లకు వాపులు వచ్చి నడవలేకపోయారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సిబ్బందిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అస్వస్థతకు గురైన విద్యార్థులను పట్టణ ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యుడు శివకాంత్ నిన్న పరీక్షించారు. నొప్పుల కారణంగా కొందరు నడవలేని స్థితికి చేరుకోగా, మరికొందరు జ్వరం బారినపడ్డారు. మరికొందరు స్పృహ తప్పి పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన 25 మందిని బాదేపల్లి కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పీఈటీ శ్వేత తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో స్పందించిన ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు పీఈటీని విధుల నుంచి తొలగించారు.