byసూర్య | Sun, Jul 03, 2022, 10:55 PM
భారత్ మిగతా దేశాలకు దారిచూపే 'విశ్వ గురువు'గా ఎదుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అయితే, కుటుంబ పాలనలు, కుల రాజకీయాలు, వెన్నెముకలేని రాజకీయాల వంటివి దేశానికి పట్టిన దరిద్రాలు అని వివరించారు. ఏళ్ల తరబడి దేశ దుస్థితికి ఇవే కారణమని అభిప్రాయపడ్డారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు, విపక్షాల్లో ఐక్యత లేదని, కాంగ్రెస్ పార్టీ నేతలు తమ సొంత పార్టీలోనే అంతర్గత ప్రజాసామ్యం కోసం కుమ్ములాడుకుంటున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. వచ్చే 30-40 ఏళ్లు బీజేపీ శకం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఓ కుటుంబ పార్టీగా మారిపోయిందని, ఓడిపోతామన్న భయంతో ఆ కుటుంబం కనీసం పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు కూడా జరుపుకోవవడంలేదని ఎద్దేవా చేశారు.