byసూర్య | Thu, Jun 23, 2022, 07:57 PM
అమాయకులకు ఓటీపీలు పంపించి డబ్బులు దండుకుంటున్న సైబర్ నేరస్థుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దిల్లీ నుంచి పీటీ వారెంట్పై నగరానికి తీసుకొచ్చారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం... ఝార్ఖండ్ రాష్ట్రం గిరిడ్ జిల్లాకు చెందిన నీరజ్శర్మ(30) ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులే లక్ష్యంగా నేరాలకు ఉపక్రమించాడు. వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోవాలని, లేదంటే మీ ఖాతా రద్దు అవుతుందని హెచ్చరిస్తూ తొలుత సందేశాలను పంపిస్తాడు. అతడి మాటలను విశ్వసించి ఏం చేయాలని అడగడమే తరువాయి, సంబంధిత ఖాతాదారులకు క్షణాల్లో లింక్ పంపిస్తాడు.
ఆనక బ్యాంక్ ఖాతా/సీవీవీ నంబర్లు తెలుసుకొని, ఓటీపీలు పంపించి ఖాతాలు ఖాళీ చేయసాగాడు. ఈ క్రమంలో నీరజ్ శర్మపై హైదరాబాద్ సైబర్ ఠాణాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. తమకు లభించిన ఆధారాలతో నిందితుడు దిల్లీలో ఉన్నాడని హైదరాబాద్ సైబర్ బృందం గుర్తించింది. దీంతో అక్కడికి వెళ్లి నిందితుడిని పీటీ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.