byసూర్య | Wed, Jun 22, 2022, 01:32 AM
బోనాలు అంటే అందరికీ గుర్తోచ్చేది తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి బోనాలకు తెలంగాణ సంస్కృతిలో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. మృగశిర కార్తెలో వచ్చే ఈ బోనాలను ఇక్కడి ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇదిలావుంటే ఈ ఏడాది బోనాల వివరాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. గోల్కొండ బోనాలు, ఏర్పాట్లపై నేడు గోల్కొండ వద్ద సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జూన్ 30 నుంచి గోల్కొండ బోనాలు షురూ అవుతాయని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ఆధ్వర్యంలో బోనాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బోనాల కోసం తమ ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించినట్టు తలసాని పేర్కొన్నారు. మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలకు రాష్ట్ర పండుగ హోదా లభించిందని అన్నారు.