byసూర్య | Wed, May 25, 2022, 03:35 PM
ప్రధాని మోడీకి, హైదరాబాద్ లో స్వాగతం పలకడం మొదలు. వీడ్కోలు వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం కేసీఆర్ గైర్హాజరు అవుతున్నందున ఆయన తరఫున 'మినిస్టర్ ఇన్ వెయిటింగ్'గా తలసాని హాజరు కానున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గ్రాడ్యుయేషన్ సెర్మనీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ప్రధాని మోడీ గురువారం నగరానికి వస్తున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతారు.
గచ్చిబౌలి ఐఎసీబీలో జరిగే కార్యక్రమంలోనూ తలసానే పాల్గొన నున్నారు. మూడు గంటల పాటు ఉండే ప్రధాని వెంట రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని కంటిన్యూ అవుతారు. చివరకు విమానాశ్రయంలో వీడ్కోలు కార్యక్రమానికి కూడా ఆయనే హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరు పర్యటన నేపథ్యంలో ప్రధానికి స్వాగతం పలికే అవకాశం లేకుండా పోయింది. ఫిబ్రవరి మొదటి వారంలో ముచ్చింతల్ లోని రామానుజా చార్యుల సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని హాజరైన సమయంలోనూ స్వాగతం పలకడానికి కేసీఆర్ హాజరు కాలేదు. ఆయన తరఫున మంత్రి తలసాని వెళ్లారు. ఇప్పుడు రెండోసారి కూడా అదే జరుగుతున్నది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ తమిళి పై సౌందర్ రాజన్ హైదరాబాద్ కు వచ్చే ప్రధానికి స్వాగతం పలకనున్నారు. నగర మేయర్ హాజర్ లేదా అనేది ఇంకా అధికారికంగా హాజరవుతారా వెల్లడికాలేదు. హైదరాబాద్ నగరంలో 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెసు ప్రపంచ వ్యాప్తంగానే గుర్తింపు ఉన్నది. తెలంగాణ ప్రైడ్ గా చెప్పుకునే ఈ సంస్థ కార్యక్రమానికి సీఎం దూరంగా ఉండడంపై విపక్షాల నుంచేకాక విద్యావేత్తలు, మేధావుల నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది.