byసూర్య | Mon, May 23, 2022, 08:25 PM
ఈ రోజుల్లో ఏ వాహనం రోడ్డెక్కినా స్పీడులో ఏ మాత్రం తగ్గడంలేదు. అంతేకాదు తామే ముందువెళ్లాలన్న తపన వాహనాలకు వాహనాలకు మద్య దూరం ఏ మాత్రం కనిపించకుండా కార్లు, బైకులు రయ్ రయ్ అంటూ పరుగెడుతున్నాయి. రోడ్డుపై వాహనానికి, మరో వాహనానికి మధ్య కనీస దూరం పాటించాల్సిన అవశ్యతను తెలియజేసే ఘటన ఒకటి చోటుచేసుకొంది. చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్కు వస్తున్న అంబులెన్స్కు దారిచ్చే క్రమంలో ఏడు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. బీజాపూర్ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిందీ ఘటన. హైదరాబాద్ వైపు వెళ్తున్న అంబులెన్స్కు చోటిచ్చే క్రమంలో కారులో ముందువెళ్తున్న వ్యక్తి వేగాన్ని ఒక్కసారిగా తగ్గించాడు.
దీంతో దాని వెనకే వస్తున్న ఏడుకార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అంతే.. ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిలిచిపోవడంతో స్పందించిన వాహనదారులు చొరవ తీసుకుని కార్లను రోడ్డు పక్కకు తరలించారు. డ్రైవింగ్ సమయంలో వాహనానికి, వాహనానికి మధ్య కనీస దూరం పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు చేవెళ్ల ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.