byసూర్య | Sun, May 22, 2022, 12:42 PM
మా తెలంగాణ రాష్ట్రంలో మీ ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటు చేయండి అని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు అరైవల్ ప్లాంట్ యాజమాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. ఇదిలావుంటే తెలంగాణకు పెట్టుబడుల తీసుకురావడమే లక్ష్యంగా లండన్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గడచిన నాలుగు రోజులుగా అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలతో భేటీ అయిన కేటీఆర్... శనివారం ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు అరైవల్ ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కంపెనీ అధికారులతో మాట్లాడారు. కంపెనీ తయారు చేస్తున్న వాహనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా తెలంగాణలో ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ ఉన్నతాధికారులను కోరారు. తెలంగాణ రవాణాలో మరింత సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం అరైవల్ వాహనాలు ఎంతగానో దోహదపడతాయని కేటీఆర్ అన్నారు. కాలుష్య కారకాలను విడుదల చేయని రీతిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దిగ్గజ కంపెనీగా ఉన్న అరైవల్... ఎలక్ట్రిక్ బస్సులు, వ్యాన్లను తయారీ చేస్తోంది. లండన్ వేదికగా ఈ కంపెనీ తన కార్యకలాపాలను సాగిస్తోంది.