byసూర్య | Thu, May 19, 2022, 09:26 PM
వరి వేస్తే ఉరేనని పంటలు లేట్గా వేసుకునేలా చేసింది ఎవరు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం-2022 పంటల సాగు సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా అంటూ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పంట లేటుగా వేస్తే, గాలివాన వస్తే సీఎం ఆప్తాడా అని చేతకాని మాటలు చెబుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి గారు, వరి వేస్తే ఉరేనని పంటలు లేట్గా వేసుకునేలా చేసింది ఎవరు? కొనం కొనం అని చివరకు కొంటానన్న సన్నాసులు ఎవరు? వానలు వచ్చే కంటే నెల రోజుల ముందే కల్లాల్లో వడ్లు పోసి రైతు తయ్యారుగుంటే మీరేం చేస్తున్నారు?’ అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ఎన్ని వడ్లు కొంటానని ఎన్ని కొన్నారని ఆమె నిలదీశారు. కాంటాలు పెట్టడం, టార్ఫాలిన్ కవరు, సంచులు ఇవ్వడం చేతకాలేదు కానీ.. పంటలు లేట్గా వేసుకున్నారు కాబట్టే వర్షానికి వడ్లు తడిసే పరిస్థితి వచ్చింది అంటూ రైతులదే తప్పని చెప్తున్నారా? అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు పండించినందుకు రైతును దోషిని చేస్తున్నారా? అంటూ ట్విట్టర్ వేదికగా షర్మిల ప్రశ్నలు గుప్పించారు.