byసూర్య | Thu, May 19, 2022, 05:11 PM
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. మొత్తం 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఇదివరకే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ విధంగానే వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 9,618 గ్రూప్ 4 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ - 4 పోస్టుల నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు అధికారులతో చర్చించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరైయ కార్యచరణ గురించి చర్చించారు. గ్రూప్-4 కు సంబంధించి 9,618 పోస్టుల భర్తీపై చర్చించడం జరిగింది. ఈ నెల 29వ తేదీలోపు ఆయా శాఖల్లోని ఖాళీల వివరాలను టీఎస్పీఎస్సీకి పంపించాలని ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు.