byసూర్య | Tue, May 17, 2022, 05:19 PM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. వరంగల్ లో రాహుల్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు. చింతన్ శిబిర్ లో తీసుకున్న నిర్ణయాలు కూడా జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికల పై ఫోకస్ పెట్టింది. మే 21 నుంచి జూన్ 21 వరకు కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించనుంది. అదే విధంగా పల్లెబాట కార్యక్రమం నిర్వహించేందుకు కూడా కాంగ్రెస్ సన్నాహాలు చేస్తుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక సందేశం ఇచ్చారు.
పార్టీ నేతలంతా ఒకే మాట పై ఉండాలని, పార్టీ పై విమర్శలు చేయవద్దని సొంత నేతలకు రాహుల్ గాంధీ గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీకి చెడు చేసే వారు వెంటనే పార్టీని వదిలి వెళ్లాలని కూడా రాహుల్ చెప్పారు. దీంతో తెలంగాణ నేతలు నిశ్శబ్దమయ్యారు. అంతే కాకుండా రాహుల్ సూచనతో పూర్తిగా ప్రజల్లోనే ఉంటున్నారు. కాంగ్రెస్ నేతలంతా తమతమ నియోజకవర్గాల్లోనే ఉంటున్నారు. తమ నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు. సమస్యలున్న దగ్గరికి వెళ్లి వివరాలు సేకరించి ఆందోళనలు కూడా చేస్తున్నారు.
ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా తన రూట్ మార్చారు. ఇప్పుడు పూర్తిగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా తిరుగుతున్నారు. వివాహాలు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అధికారులతో సమావేశమై అభివృద్ది పనుల పై చర్చిస్తున్నారు. పలువురికి సాయం అందిస్తున్నారు.
అదే విధంగా జగ్గారెడ్డి, ఇతర సీనియర్ నేతలు కూడా నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ నేతలంతా తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పర్యటనలు చేస్తున్నారు. కొంత మంది నేతలు ఆహ్వానాలు అందకున్నా నేరుగా వెళ్లి ప్రజలతో మమేకం కావడం విశేషం. నిత్యం ఏదో ఒక పనితో పూర్తిగా ప్రజల్లో ఉండేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ ఆదేశాలతో పాటు వ్యక్తిగతంగా కూడా తమ ఇమేజ్ ను పెంచుకునేందుకు నేతలు యత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్ తో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందని అంతా చర్చించుకుంటున్నారు.