byసూర్య | Tue, May 17, 2022, 11:22 AM
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి జనంలోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళితో రెడీ అయ్యారు. పల్లెబాట పేరిట నియోజకవర్గాన్ని చుట్టేయనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి గ్రామాల్లో పర్యటనకు బయలుదేరనున్నారు. గ్రామాల్లో ప్రజలతో ముఖాముఖి కానున్నారు. ప్రజాసమస్యలను తెలుసుకుని సాధ్యమైనంతవరకూ అక్కడికక్కడే పరిష్కరించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకు అన్నిశాఖల అధికారులను సైతం వెంటబెట్టుకుని గ్రామాలకు పయనం కానున్నారు. నియోజకవర్గంలోని సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట మండలాల్లో రోజు నాలుగు గ్రామాల్లో పర్యటించనున్నారు. ప్రజాసమస్యల పరిష్కారంతోపాటు వరంగల్ సభలో పార్టీ యువనేత ప్రకటించిన రైతుడిక్లరేషన్ను ప్రతి గ్రామాన వివరించనున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ప్రజలకు దూరమయ్యానని, పల్లెబాటతో గడగడపకూ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.