byసూర్య | Tue, May 17, 2022, 08:30 AM
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, విద్యార్థులు విద్యాభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమవారం నాడు మునిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం చిన్నచెల్మడ గ్రామంలో సర్పంచ్ గాడిఖాన విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమానికి పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించిందన్నారు. మండలంలో 18 పాఠశాలలను మన ఊరు - మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి దాతలు కూడా ముందుకు రావాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.