byసూర్య | Tue, May 17, 2022, 08:29 AM
సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలాంలో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. సోమవారం తెల్లవారు జామున భారీ వర్షం కురవగా పుల్కల్ ఉమ్మడి మండలంలో సుమారు మూడు వేల క్వింటాళ్ల వరిధాన్యం నీటిపాలైంది. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చిన దశలో నీటి పాలైందని కన్నీటి పర్యంతమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో తీసుకొచ్చిన ధాన్యాన్ని సకాలంలో తరలించకపోవడంతో తమకు తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు. 15 రోజులవుతున్న ఇప్పటి వరకు తమ పంట కేంద్రాల వద్దే ఉందని చెప్పారు. లారీలు, హమాలీల కొరత కారణంగా తమ పంట సకాలంలో అమ్ముడవ్వడం లేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.