![]() |
![]() |
byసూర్య | Sat, May 14, 2022, 03:43 PM
తెలంగాణ రాజకీయాలు ఇటీవల కాలంలో వేడెక్కాయి. ఎన్నికలకు రెండేళ్లు ఉండగానే రాష్ట్రమంతటా ఎన్నికల వాతావరణం ప్రతిబింబిస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. మరో వైపు ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్లో సభ పెట్టి, రైతు డిక్లరేషన్ ప్రకటించారు. ఈ తరుణంలో బీజేపీ సైతం కీలక నేతలను రాష్ట్రానికి రప్పిస్తోంది. ఈ తరుణంలో హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుకు శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేరుకున్నారు. సీఐఎస్ఎఫ్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లేబొరేటరీని తొలుత ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తుక్కుగూడ ప్రాంతంలో బీజేపీ తెలంగాణ చీఫ్, ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు. ఈ సభలో ఆయన చేయనున్న ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇక అమిత్ షా తెలంగాణ పర్యటనపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఏమిచ్చిందని టీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. శుక్రవారం అమిత్ షాకు కేటీఆర్ 27 ప్రశ్నలను సంధించారు. ఈ తరుణంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. బీజేపీ కుట్రలు తెలంగాణలో పారవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయిన 'ఛీ'ఆర్ఎస్తో బీజేపీ దోస్తీ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ చేపట్టిన సభలో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లు, పెట్రోల్-గ్యాస్ ధరల పెంపు వంటి 9 అంశాలపై రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని అమిత్ షాకు సవాల్ విసిరారు.