byసూర్య | Sat, May 14, 2022, 09:11 AM
తమ కలల పంటగా పుట్టిన చిన్నారి పుట్టువెంట్రుకల వేడుకను ఘనంగా నిర్వహించాలని కలలు కన్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న ఆటో బోల్తాపడిన ప్రమాదంలో చిన్నారితోపాటు తాత, అమ్మమ్మ మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట వద్ద గురువారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. మానకొండూర్ మండలం ముంజంపల్లికి చెందిన మేకల రాజకుమార్ తన పెద్దకూతురు హారిక (2) పుట్టువెంట్రుకల్ని వేములవాడలో తీయించాలని కుటుంబ సభ్యులతో ఆటోలో బయలుదేరారు. బావుపేట సమీపానికి వెళ్లగానే మూలమలుపు వద్ద వేరే వాహనాన్ని చూసి హఠాత్తుగా బ్రేకులు వేయడంతో అదుపుతప్పిన ఆటో డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. మూడు పల్టీలు కొట్టి రోడ్డుకు అవతలి వైపు పడటంతో ఆటోను నడుపుతున్న రాజ్కుమార్ అతని పెద్ద కూతురు హారిక, ఆయన తండ్రి మేకల మల్లయ్య, తల్లి మల్లమ్మ, భార్య రమ, అత్తమ్మ తొడెంగుల ఓదమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ హారిక(2), మేకల మల్లయ్య (67), తొడెంగుల ఓదెమ్మ (65) మృతి చెందారు. హారిక మృతి చెందిన సంగతి చికిత్స పొందుతున్న తల్లిదండ్రులకు మొదట తెలియనివ్వలేదు. అంత్యక్రియల సమయంలో చెప్పడంతో అటు తండ్రిని ఇటు కూతురుని కోల్పోయిన రాజ్కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పటి నుంచో పుట్టువెంట్రుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని తల్లిదండ్రులు ఆరాటాన్ని చూపేవారని.. తీరా తమ కన్న కూతురు ఇలా మృతి చెందిన తీరుని చూసి హారిక తల్లి రమ కన్నీరుమున్నీరుగా విలపించారు. రాజ్కుమార్ ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తుండగా మల్లయ్య తనకున్న రెండు ఆవులను కాస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచేవాడు. ప్రమాదం తీరుపై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.