byసూర్య | Sat, May 14, 2022, 08:48 AM
పెళ్లయి మూడు నెలలు గడవక ముందే ఆమె దాంపత్య జీవితానికి నూరేళ్లు నిండాయి. భార్యపై అనుమానంతో భర్తే హత్య చేశాడు. పైగా బలవన్మరణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులకే సమాచారం అందించిన ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నల్గొండ టూటౌన్ ఎస్సై రాజశేఖర్రెడ్డి అందించిన వివరాలు.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చౌకత్పల్లి తండాకు చెందిన ముదావత్ శంకర్కు అదే జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన శిరీష(22)తో గత ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందు నుంచి శంకర్ నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కొరటికల్ గ్రామసమీపంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. అయితే ఉగాది పండుగ రావడంతో అత్తగారింటి వద్ద ఉన్న శిరీషను తన ఊరికి తీసుకెళ్లాడు. అయితే ఇటీవల శిరీష వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం శంకర్లో మొదలైంది. ఈ విషయమై భార్యతో పలుమార్లు ఘర్షణకు దిగాడు.
దీంతో ఆమె ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో వారం, పది రోజులుగా శిరీష తన భర్తకు ఫోన్ చేసి తనను తీసుకెళ్లాలని కోరింది. దీంతో శంకర్ ఈ నెల 12న శిరీషను నల్లగొండకు తీసుకువచ్చాడు. తాను పనిచేసే ప్రాంతానికి బస్సులు లేవని చెప్పి, బస్టాండ్ ఎదురుగా వున్న పున్నమి లాడ్జిలో గురువారం సాయంత్రం గదిని అద్దెకు తీసుకున్నాడు.
గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు శంకర్, శిరీషలు పలుమార్లు బయట మార్కెట్కు వెళ్లి తిరిగి వచ్చారు. అయితే శుక్రవారం రాత్రి పున్నమి లాడ్జికి చెందిన సిబ్బంది గది తలుపులు తట్టగా తెరుచుకున్నాయి. అక్కడ చూసే సరికి శిరీష మెడకు చున్నీ బిగించి ఉండటంతో పాటు విగతజీవిగా కనిపించింది. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డితో పాటు సీఐ చంద్రశేఖర్రెడ్డి, టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్రెడ్డిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా శిరీష భర్త శంకర్ నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. కాగా, శిరీష స్వగ్రామమైన ఎస్కొండాపూర్లో, అటు శంకర్ స్వగ్రామమైన చౌకత్పల్లిలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. శంకర్ కుటుంబసభ్యులు మెదక్ జిల్లా నిజాంపేట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.