byసూర్య | Sat, May 14, 2022, 08:43 AM
అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్కాలనీలోని బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనూహ్యంగా వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం శనివారం మంత్రులు కేటీఆర్, శ్రీనివా్సగౌడ్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు ప్రారంభం కావాల్సింది. అయితే ఇది వాయిదా పడినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం వాయిదా వేసినట్లు సమాచారం. ఆసియా ఖండంలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా గుర్తింపు దక్కాలన్న సంకల్పంతో కేసీఆర్ ఈ ప్రాజెక్టును పూర్తిచేయించారు. వాస్తవానికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలలో ఎవరో ఒకరితో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయంతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంప్రదింపులు కూడా జరిపారు. ఆ తర్వాత ధాన్యం కొనుగోళ్లు ఇతర అంశాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత దూరం పెరగడంతో ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అంశం పక్కన పడింది. కాగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ నెల 14న మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తుండటంతో. అదే రోజున బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి సూచనలు అందాయి. కాగా వివిధ దేశాల నుంచి పెద్దఎత్తున బౌద్ధ భిక్షువులను ఆహ్వానించి వారి సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే కార్యక్రమాన్ని వాయిదా వేసిందని విశ్వసనీయ సమాచారం. సాగర్లో శనివారం వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్న కేటీఆర్ బుద్ధవనాన్ని కూడా సందర్శించనున్నారు.