byసూర్య | Fri, May 13, 2022, 09:48 PM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్షా రానున్నారు. ఈ సందర్భంగా అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీది కక్ష, వివక్షే అలానే ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఉపన్యాసాలిచ్చి పత్తా లేకుండా పోవడం బీజేపీ నాయకులకు అలవాటైపోయిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం పట్ల చిత్తశుద్ది ఉంటే తాను సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని అమిత్ షాకు సవాల్ విసిరారు.
బహిరంగ లేఖలో కేటీఆర్ సంధించిన ప్రశ్నలు..
- విభజన చట్టంలోని ఒక్క హామీనైనా కేంద్రం నెరవేర్చిందా?
- కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ లో ఎలా వస్తుంది? కాజీపేటలో ఎందుకు పెట్టరు?
- నవోదయ, ఐఐఎం, ఐసర్ విద్యాలయాలు ఎందుకు కేటాయించలేదు?
- బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీకి ఎందుకు తుప్పు పట్టించారు?
- హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి అడ్డుకునేందుకు ఐటీఐఆర్ రద్దు కుట్ర కాదా?
- ఐటీ రంగంలో అగ్రస్థానంలో తెలంగాణ ఉంది.. అలాంటిది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు ఎందుకివ్వడం లేదు?
- పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు?
- సాగునీటి హక్కులు దక్కకుండా చేస్తున్న తాత్సారంపై ఏం చెప్తారు?
- హైదరాబాద్ ఫార్మాసిటీకి ఎందుకు సాయం అందించడం లేదు?
- ఢిపెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయడం లేదు?