byసూర్య | Fri, May 13, 2022, 03:45 PM
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామ పంచాయితీ కార్యదర్శి ఒడ్డేం హరీష్ (27) గురువారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్రియాల్ కు చెందిన హరీష్ మద్దికుంట జిపి జూనియర్ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఇతనికి గత మూడేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినా ఒక్క సంబంధం కూడా ఖరారు కాలేదు. ఎప్పటిమాదిరిగానే విధులు నిర్వహించేందుకు మద్దికుంటకు వెళ్ళిన హరీష్కు అతని తండ్రి శివరాజు ఫోన్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తావ్ అని అడిగాడు. కాగా డ్యూటీ అయిపోగానే సాయంత్రం 6. 30 గంటలకు వస్తానని సమాధానం ఇచ్చాడు. కానీ ఇల్చిపూర్ శివారులోని వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నట్లు తెలిపారు. మూడేళ్లుగా పెళ్లి సంబంధాలు చూసిన కుదరకపోవడంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొంటూ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.