byసూర్య | Mon, Jan 17, 2022, 09:30 PM
వైద్యం చేసేవారిపైనే కరోనా ప్రభావం చూపితే దాని తీవ్రత మరింత గా పెరిగే అవకాశముంది. ఇపుడు అదే అంశం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. వేలాది మంది కరోనా పేషెంట్లు గాంధీలో చికిత్స పొంది ప్రాణాలను నిలుపుకున్నారు. ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పేషెంట్లను కాపాడారు. ఇప్పుడు ఆ ఆసుపత్రి వైద్యుల పైనే కరోనా పంజా విసిరింది. ఏకంగా 120 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. వీరిలో 40 మంది పీజీ విద్యార్థులు, 38 మంది హౌస్ సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, ఆరుగురు ఫ్యాకల్టీలు ఉన్నారు. ఒక్కసారిగా ఈ స్థాయిలో వైద్యులు కరోనా బారిన పడటంతో ఇతర సిబ్బందిలో తీవ్ర ఆందోళన మొదలైంది. మరికొందరు సిబ్బందికి చెందిన కోవిడ్ రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది.