byసూర్య | Mon, Jan 17, 2022, 05:26 PM
బీసీలపై కేసీఆర్ ది ప్రేమ కాదని జనాలను మీటింగ్ లకు రప్పించే నేతలుగా మాత్రమే ఆయన చూస్తారని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వై.ఎస్.షర్మిళ విమర్శించారు. బీసీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలాంటి ప్రేమ లేదని ఆమె అన్నారు. బీసీలంటే దొర దృష్టిలో ఆయన మీటింగులకు జనాలను తెచ్చేవారని విమర్శించారు. గెలిచేందుకు ఓట్లేసే ఓటర్లు తప్ప బీసీలు దొరకు అవసరం లేదని అన్నారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకునే దొరకు... బీసీలకు లోన్లు ఇవ్వడానికి మాత్రం పైసలు ఉండవని దుయ్యబట్టారు. బీసీ బిడ్డలకు ఫీజులు కట్టేందుకు డబ్బులు ఉండవని అన్నారు. ఆత్మగౌరవ భవనాలు అంటూ ముగ్గుపోసి వదిలేశారని విమర్శించారు. బీసీలను మురిపించి వాడుకోవడం, సంఘాల పేరుతో విడదీయడం తప్ప బీసీలకు చేసిందేమీ లేదని అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లను కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పదవులు కూడా ఇవ్వడం లేదని అన్నారు. బీసీల కనీస అవసరాలు కూడా తీర్చలేని ముఖ్యమంత్రి మనకు వద్దని చెప్పారు.