byసూర్య | Mon, Jan 17, 2022, 04:05 PM
కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ మార్క్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. గ్రూపుల మధ్య వివాదాలు తలెత్తాయి. ఇదిలావుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అయితే మిర్యాలగూడలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. ఓ ఫ్లెక్సీ వివాదంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. నేతల ముందే ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సకాలంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆయన ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో ఘర్షణ తప్పింది. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను కాపాడే కార్యాచరణ మిర్యాలగూడ నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, నల్గొండ మాజీ ఎంపీలు కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీశారని ఆరోపించారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ ను గెలిపించేందుకు, పార్టీకి పునర్ వైభవాన్ని అందించేందుకు సూచనలు, సలహాలు ఇస్తానని జానారెడ్డి తెలిపారు.