byసూర్య | Mon, Jan 17, 2022, 02:23 PM
కరోనా కట్టడి చర్యలపై ఈరోజు కేబినేట్ లో నిర్ణయం తీసుకొంటామని రాష్ట్ర హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ఏజీ తెలిపారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ కొనసాగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటోన్న చర్యలను హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. తెలంగాణలో కరోనా నియంత్రణపై నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నట్లు కోర్టుకు ఏజీ తెలిపారు. అయితే, కరోనా కట్టడిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష చొప్పున ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని, ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని చెప్పింది. రాష్ట్రంలో భౌతిక దూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా పాటించాలని, కరోనా నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని తెలిపింది. కరోనా కట్టడిపై విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఇదిలావుంటే తెలంగాణలో మెడికల్ కాలేజీలు మినహా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, ఓయూ, అంబేద్కర్ యూనివర్సిటీలు అన్ని పరీక్షలను వాయిదా వేశాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొంతకాలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ పెడతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై కేబినెట్ భేటీ అనంతరం స్పష్టతవచ్చే అవకాశం ఉంది.