byసూర్య | Mon, Jan 17, 2022, 12:03 PM
రంగారెడ్డి: జిల్లాలోని యాచారం మండలంలో మరోసారి చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని పిల్లిపల్లి శివారులో ఉన్న పొలంలో ఆవు దూడను చంపి తినేసింది.స్థానికులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. వీలైనంత తొందరగా దానిని పట్టుకోవాలని కోరారు. అయితే గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని సూచించారు.వారం రోజుల క్రితం మండలంలోని నానక్నగర్లో చిరుతపులి సంచరించింది. ఈనెల 8న మేకల మందపై దాడిచేసి ఓ మేకను చంపింది. కాగా, గతేడాది నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజ్జిలాపురంలో అడవిపందుల కోసం వేసిన ఉచ్చులో పడడంతో దానిని నగరంలోని జూకు తరలించారు. కొంతకాలానికి అది మరణించింది.దీంతో ఏడాదిపాటు రెండు మండలాల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఒకటే చిరుత ఉందని అధికారులు అనుకున్నారు. కానీ ఇటీవల యాచారం మండలం మేడిపల్లి-నానక్నగర్ గ్రామాల మధ్య ఉన్న అడవిలో మరో చిరుత మళ్లీ కలకలం సృష్టిస్తున్నది.