byసూర్య | Fri, Jan 14, 2022, 10:50 PM
అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారంచెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన అధికారులతో సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాళ్ళ వాన కురుస్తుందని ఎవరూ ఊహించలేదని, వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేసారు. రైతు లక్షల రూపాయలు వెచ్చించి మిర్చి పంట వేశారని, ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు ఈటల. రైతులను, నష్టపోయిన పంటను ఎందుకు అధికారపార్టీ ఎమ్మెల్యేలు సందర్శించడం లేదని, ఎందుకు ఆ కుటుంబాలను ఓదార్చడం లేదని నిలదీసారు. ముఖ్యమంత్రి ప్రగతిభవన్లో నో ఫామ్ హౌస్ లో పడుకున్నాడని, యథా రాజా తథా ప్రజా లాగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని నర్సక్కపల్లి, మల్లక్కపెట్, రాయపర్తి గ్రామాల్లో ఇటీవల కురిసిన ఆకాలవర్షాలకు దెబ్బతిన్న మిర్చి మరియు ఉల్లి పంటలను ఈటెల రాజేందర్ సందర్శించారు. యుద్ధ ప్రాతిపదికన అధికారులతో సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈటల డిమాండ్ చేసారు. ఒకసారి రాళ్ళ వాన వల్ల నష్టపోయిన రైతులు నాలుగేళ్ల వరకైనా కోలుకోలేడని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిస్తే రైతులకు నష్ట పరిహారం వచ్చేదని గుర్తు చేసారు. రైతులకు నష్టపరిహారం అందించేందుకు ఎవరి కాలవలో వారినందరిని కలుస్తామని, లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చేప్పిన చంద్రశేఖర్ రావు ఇంతవరకు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో రైతులు గగ్గోలు పెడుతుంటే ముఖ్యమంత్రికి తెలియడం లేదా? వ్యవసాయంలో అద్భుతాలను సృష్టిస్తాం అని చెప్పిన చంద్రశేఖర్ రావు ఏం చేస్తున్నాడో మీకు తెలియడం లేదా.? అని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులను మానవతా కోణంలో చూసి నష్టపరిహారం చెల్లించాలని ఈటల విజ్ఞప్తి చేసారు.