byసూర్య | Thu, Jan 13, 2022, 10:33 AM
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లి హరిహర క్షేత్రంగా బాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ముక్కోటి ఏకాదశి వేడుకలను కోవిడ్-19 నిబంధనల మేరకు అంతరంగికంగానే అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఉదయం ప్రాతః కాల పూజల అనితరం శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని, శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామి వారిని అందంగా అలంకరించబడ్డ పల్లకిలో, పెద్దసేవలో కూర్చుండబెట్టి ఆలయం చుట్టూ వేద పండితుల వేద మంత్రోచ్చరణాల మధ్య మూడు ప్రదక్షిణలు గావించారు. ఆలయ వేదపండితులు, అర్చకుల వేద పనసలతో రాజన్న ఆలయం మారుమోగింది.అనంతరం ఉత్సవమూర్తులతో ఉత్తర ద్వారం గుండా వెళ్తున్న క్రమంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. అనంతరం ఆలయం ముందు భాగంలో ఆలయ వేదపండితులు, అర్చకులు ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యం గురించి చక్కగా భక్తులకు వివరించారు.ఈ వేడుకల్లో ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు గుండి మూర్తి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, దేవాలయానికి సంబంధించిన కొందరు సిబ్బంది పాల్గొన్నారు.