byసూర్య | Tue, Jan 11, 2022, 05:58 PM
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రావడంతో దేశంలోనూ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. థర్డ్ ఫ్రంట్ చర్చ అంతర్గతంగా మొదలైంది. తాజాగా ప్రాంతీయ పార్టీల అధినేతలు వరుసగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంటోంది. తాజాగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత తేజస్వి యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ కు తేజస్వి నేతృత్వంలోని ఆర్జేడీ బృందం వెళ్లింది. ఈ బృందంలో ఆర్జేడీ నేతలు సునీల్ సింగ్, బారీ సిద్ధిఖీ, భోలా యాదవ్ ఉన్నారు. ప్రగతి భవన్ కు చేరుకున్న తేజస్వికి మంత్రి కేటీఆర్ ఆత్మీయ స్వాగతం పలికి, లోపలకు తీసుకెళ్లారు. ప్రగతి భవన్ కు వచ్చిన తేజస్వికి కేసీఆర్ పుప్పగుచ్ఛం అందించారు. జాతీయ రాజకీయాలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలు పోషించాల్సిన పాత్రపై చర్చలు జరుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ కు తేజస్వి యాదవ్ గట్టి పోటీ ఇచ్చారు. కొంచెం అటూఇటూ అయి ఉంటే తేజస్వి సీఎం అయిపోయేవారు. మరోవైపు థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే.