byసూర్య | Wed, Nov 24, 2021, 03:04 PM
జీహెచ్ఎంసీలో మంగళవారం బీజేపీ కార్పొరేటర్లు చేసిన ధ్వంసంపై టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ బోర్డుకు పాలాభిషేకం చేసి, మేయర్ ఛాంబర్ వద్ద శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు.అనంతరం డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత సారధ్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీలత మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేయర్కు వినతి పత్రం అందజేశామన్నారు. విధ్వంసం చేసిన బీజేపీ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరినట్లు చెప్పారు.
బీజేపీ కార్పొరేటర్ల చర్యలు అప్రజాస్వామికమని, తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీలత అన్నారు. గతంలో కరోనా, ఇప్పుడు ఎన్నికల కోడ్ వల్ల జనరల్ బాడీ మీటింగ్ అలస్యమైందన్నారు. బహుజన మహిళ మేయర్గా ఉండడాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతోందన్నారు. హైదరాబాదులో ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, మేయర్ కార్యాలయంలో ఉన్నది ప్రభుత్వ ఆస్తి అని, దానిని ధ్వంసం చేయడం సరికాదన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్కు విజ్ఞప్తి చేశామన్నారు.