byసూర్య | Mon, Nov 22, 2021, 11:45 AM
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే 172 రైళ్లు రద్దయ్యాయి. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని గుంతకల్లు, విజయవాడ డివిజన్లలో భారీ వర్షాలు కురవడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నెల 19, 20, 21, 22, 23, 24 తేదీల్లో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరి తెలుగురాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించేవి, తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించేవి కలిపి మొత్తంగా 172 రైళ్లు రద్దయ్యాయి. మరో 29 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 108 రైళ్లను దారి మళ్లించి నడిపించారు. గుంతకల్లు డివిజన్లో నందలూరు-రాజంపేట, రేణిగుంట-పుడి, ధర్మవరం-పాకాల సెక్షన్, విజయవాడ డివిజన్లో నెల్లూరు-పడుగుపాడు సెక్షన్లలో భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంది. పూర్తిగా రద్దయిన వాటిలో ఈ నెల 21న బయల్దేరాల్సిన రైళ్లలో గుంతకల్లు-రేణిగుంట-గుంతకల్లు, గుంతకల్లు-తిరుపతి, విజయవాడ-చెన్నై సెంట్రల్, కరీంనగర్-తిరుపతి, నిజామాబాద్-తిరుపతి, తిరుపతి-ఆదిలాబాద్-తిరుపతి, కాచిగూడ-వాస్కోడగామా, విజయవాడ-గూడురు, గూడూరు-రేణిగుంట-గూడూరు, కాచిగూడ-చెంగల్పట్టు, కాచిగూడ-చిత్తూరు-కాచిగూడ, సికింద్రాబాద్-తిరువనంతపురం, గూడురు-సికింద్రాబాద్, లింగంపల్లి-తిరుపతి-లింగంపల్లి, హైదరాబాద్-చెన్నైసెంట్రల్-హైదరాబాద్ తదితర రైళ్లున్నాయి. ఈ నెల 22న బయల్దేరాల్సిన రైళ్లలో కాచిగూడ-తిరుపతి-కాచిగూడ, తిరుపతి-హజ్రత్నిజాముద్దీన్, నిజామాబాద్-తిరుపతి-నిజామాబాద్, కాచిగూడ-చెంగల్పట్టు-కాచిగూడ రైళ్లు రద్దయ్యాయి. ఈ నెల 23న వాస్కోడగామా-కాచిగూడ, బెంగళూరు- హతియా, హజ్రత్నిజాముద్దీన్- మధురై, హజ్రత్నిజాముద్దీన్- ఎర్నాకుళం, చెన్నైసెంట్రల్- న్యూదిల్లీ- చెన్నైసెంట్రల్, న్యూదిల్లీ- త్రివేండ్రం, చెన్నై-హజ్రత్నిజాముద్దీన్- చెన్నై, చెన్నైసెంట్రల్-హజ్రత్నిజాముద్దీన్-చెన్నైసెంట్రల్, పట్నా-ఎర్నాకుళం, అహ్మదాబాద్- చెన్నైసెంట్రల్ రైళ్లు రద్దయ్యాయి. ఈ నెల 24న రద్దైన వాటిలో తిరుపతి- హజ్రత్నిజాముద్దీన్ తదితర రైళ్లున్నాయి.