byసూర్య | Sat, Nov 20, 2021, 11:47 AM
తెలంగాణ రైతులకు పౌరసరఫరాల శాఖ శుభవార్త చెప్పింది. ధాన్యం కొనుగోళ్లలో సాంకేతిక కారణాలతో తలెత్తుతున్న సమస్యలను పరిశీలించారు. ప్రస్తుతం ఆధార్ కార్డుతో అనుసంధానమైన ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీ ఆధారంగానే ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే చాలా మంది రైతుల ఆధార్ కార్డులు వారి మొబైల్ నంబర్లతో అనుసంధానం కాలేదు. కొందరికి లింక్ ఉన్నప్పటికీ.. నంబర్లు మార్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడుతోంది. సమస్య పరిష్కారానికి పోస్టల్ శాఖ అధికారులతో పౌరసరఫరాల శాఖ అధికారులు సమావేశమయ్యారు. సమస్యను వారికి వివరించి పరిష్కరించాలని కోరారు. దీనిపై హైదరాబాద్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ స్పందిస్తూ.. రైతుల వద్దకు వెళ్లి వారి ఫోన్ నంబర్ను ఆధార్తో అనుసంధానం చేస్తామని చెప్పారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ తమ పోస్టాఫీసుల క్షేత్రస్థాయి అధికారులు రైతుల ఆధార్ ఫోన్ నంబర్ను అప్డేట్ చేస్తారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ గ్రామీణ పోస్ట్మాస్టర్లు రైతుల నివాసాలకు వెళ్లి ఆధార్, మొబైల్ లింకింగ్ చేస్తారని తెలిపారు. రైతులు రూ.50 చెల్లించి ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.