byసూర్య | Tue, Oct 26, 2021, 05:59 PM
కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం రెండు లేఖలు రాశారు. సాగర్ ఎడమ కాలువను ఇష్టారీతిన పెంచుకుంటూ పోయారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టు రిపోర్టును ఖాతరు చేయలేదని, ఏపీ చేపట్టిన పిన్నపురం ప్రాజెక్టు ఆపాలని బోర్డును కోరారు. పిన్నపురం ప్రాజెక్టుకు ఏపీ ఎలాంటి అనుమతి పొందలేదని, శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలు మాత్రమే తీసుకోవాలన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్ ఆవలకు భారీగా నీరు తరలిస్తోందని, ఏపీ వైఖరి వల్ల తెలంగాణలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 1952లో ఆంధ్రాలో ప్రతిపాదిత ఆయకట్టు 1.3లక్షల ఎకరాలేనని, ప్రాజెక్టు రిపోర్టుకు భిన్నంగా 1956 తర్వాత ఆయకట్టు పెంచారన్నారు.
ఆంధ్రాలో ఆయకట్టును 3.78లక్షల ఎకరాలకు పెంచారని, తెలంగాణలో ఆయకట్టును 60వేల ఎకరాలకు తగ్గించారని ఆరోపించారు. లక్ష ఎకరాలను లిఫ్ట్ ద్వారా సాగులోకి తీసుకురావాల్సి ఉండగా.. ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదదన్నారు. 53వేల ఎకరాల ఆయకట్టును చిన్న చెరువులను స్థిరీకరించాల్సి ఉండగా.. ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించిందని, పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెగ్యులర్ గేట్ కనీస నీటిమట్టాన్ని 13 మీటర్లు తగ్గించడంతో తెలంగాణ ఆయకట్టును కోల్పోయిందని పేర్కొన్నారు.
1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఏపీ ప్రభుత్వం ఉమ్మడి నివేదికకు అనుగుణంగా ఆంధ్రాలో ఆయకట్టును 1.3లక్షల ఎకరాలకు కుదిస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు. నాగార్జున సాగర్ విషయంలో ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం లేదని, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు 1954లో చేసిన ఉమ్మడి నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును కట్లేరు వాగు వరకు 1.3లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని, జూలై 15 గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్-2లో పేర్కొన్న 4.8 నుంచి 4.14 వరకు ఉన్న అంశాలను తొలగించాలని, ఈ అంశాలను కేంద్ర జలశక్తి శాఖను నివేదించాలని ఎన్సీ.. కేఆర్ఎంబీ చైర్మన్ను కోరారు.