byసూర్య | Tue, Oct 26, 2021, 04:25 PM
ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు హెల్మెట్లు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. సోమవారం ఓ పీజీ విద్యార్థినిపై ఫ్యాన్ విరిగి పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వైద్య విద్యార్థినికి స్వల్ప గాయాలు కావటంతో ఉస్మానియా జూడాలు ఉదయం కొద్ది సేపు మౌన దీక్ష చేపట్టారు. అనంతరం సూపరిండెంట్కి ఘటనపై ఫిర్యాదు చేసి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ ఘటన తర్వాత ఆస్పత్రిలో శిథిలమైన సీలింగ్ ఫ్యాన్లు చూసి వైద్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఫ్యాన్లు ఎప్పుడు మీద పడతాయోననే భయంతోనే వైద్యులు విధులకు హాజరవుతున్నారు. మరికొందరు పీజీ విద్యార్థులు ఆస్పత్రిలో హెల్మెట్ ధరించి నిరసన తెలిపారు. ఉస్మానియాలో రోగులు, వైద్య సిబ్బదికి రక్షణ లేకుండా పోయిందని వారు ఆరోపించారు.