byసూర్య | Tue, Oct 26, 2021, 02:23 PM
తెలంగాణలో వ్యాక్సిన్ విషయంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు చేసిన ఓ ప్రకటన.. తీవ్ర గందరగోళాన్ని రేపింది. వ్యాక్సిన్ తీసుకోకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారిన వారి రేషన్, పెన్షన్ కట్ చేస్తామంటూ డీహెచ్ శ్రీనివాసరావు హెచ్చరించారు.. నవంబర్ 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందంటూ డేట్ కూడా చెప్పేశారు. తెలంగాణలో అందరూ వ్యాక్సిన్ తీసుకునేందుకే ఈ చర్యలన్నారు శ్రీనివాసరావు.. పెన్షన్, రేషన్కు.. వ్యాక్సిన్కు లింకేంటంటూ ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలోనే పౌరసరఫరాల శాఖ మరో ప్రకటన చేసింది.
డీహెచ్ వ్యాఖ్యలపై సివిల్ సప్లయ్ శాఖ అధికారులు మాత్రం భిన్నంగా స్పందించారు.. వ్యాక్సినేషన్తో తమకు సంబంధం లేదని.. రేషన్ ఆపాలని తమకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. అటు సెర్ప్ అధికారులు ఈ విధంగానే స్పందించారు. వ్యాక్సినేషన్తో పెన్షన్కు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. దీంతో డీహెచ్ శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయమా, శాఖా పరంగా తీసుకున్న నిర్ణయమా, లేక స్వయంగా వన్ సైడెడ్గా చేసిన అనౌన్స్మెంటా అనే దానిపై గందరగోళం నెలకొంది.. ఇప్పుడు ఎవరి వ్యాఖ్యలు అధికారికంగా వచ్చాయో అని తెలంగాణ ప్రజల్లో డైలమా నెలకొంది.
మరోవైపు తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3 కోట్ల ఒక లక్షా 92 వేలకు పైగా డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది.. ఇందులో ఫస్ట్ డోస్ పూర్తి చేసుకున్నవారు 2 కోట్ల 14 లక్షల 6 వేల మందికి పైగా ఉండగా.. రెండు డోసులు తీసుకున్న వారు 87 లక్షల 86 వేలకు పైగా ఉన్నారు.. మేడ్చల్, నల్లగొండ జిల్లాలోని నర్సింగ్ స్టాఫ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వ్యాక్సిన్పై అవగాహాన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సాధారణ ప్రజల్లో కూడా చాలా మంది ఇప్పటి కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి తటపటాయిస్తున్నారు.. ఇప్పటికే ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది సర్కార్.. ఈ కఠిన నిర్ణయాల్లో భాగంగానే నవంబర్ ఒకటి నుంచి వ్యాక్సిన్ తీసుకొని వారికి రేషన్, పెన్షన్ కట్ చేస్తామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచుతామన్నారు.. అయితే రేషన్ కట్ చేయడానికి వ్యాక్సినేషన్కు సంబంధమేంటన్నది మాత్రం అంతుబట్టడం లేదు.