byసూర్య | Tue, Oct 26, 2021, 11:40 AM
పాండిచ్చేరిలో యువతనే టార్గెట్ చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు బయటపెట్టారు. పాండిచ్చేరికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వెళుతుంటారు. అలా కుటుంబాలతో కాకుండా స్నేహితులతో వచ్చే కుర్రకారుకు వల వేసి డబ్బు సంపాదించుకుంటున్న వ్యభిచార ముఠా గుట్టును అక్కడి పోలీసులు రట్టు చేశారు. బ్యూటీ సెలూన్ల పేరుతో లోపల వ్యభిచారం చేస్తున్న ఆ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు సంపాదన ఎక్కువగా ఉండటంతో కొందరు అమ్మాయిలు, మహిళలు ఈ రొంపిలోకి దిగుతున్నారు. ఇలాంటి ముఠాల దగ్గర మామూళ్లు తీసుకుని కొందరు పోలీసులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో అక్టోబర్ 16న పాండిచ్చేరిలోని అన్నా నగర్, మారైమలై అడిగల్ రోడ్, కామరాజ్ రోడ్లోని 3 ప్రాంతాల్లోని 3 మసాజ్ పార్లర్లపై పోలీసులు రైడ్స్ చేశారు. పోలీసులు లోపలికి వెళ్లి చూడగా ఒకే మహిళతో ఇద్దరు ఉండటం, ఒకే గదిలో ఇద్దరమ్మాయిలతో ఓ యువకుడు ఉండటం కనిపించింది. ఇలా పోలీసుల రైడ్స్లో 10 మంది మహిళలు, 9 మంది విటులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ఈ మసాజ్ పార్లర్ల లైసెన్స్లను రద్దు చేయాలని పాండిచ్చేరి మున్సిపాలిటీకి పోలీసులు లేఖ పంపారు. దీంతో పాండిచ్చేరి మున్సిపల్ కమిషనర్ శివకుమార్, రెవెన్యూ అధికారి సాంబశివమ్, సిబ్బంది ఆ మసాజ్ పార్లర్లను సీజ్ చేశారు. వాటి లైసెన్స్లను కూడా రద్దు చేస్తున్నామని ప్రకటించారు.