byసూర్య | Tue, Oct 26, 2021, 08:33 AM
రాబోయే ఏడేళ్లలో దళితబంధు అమలు కోసం బడ్జెట్ల ద్వారా మొత్తం రూ.23 లక్షల కోట్లు ఖర్చు పెడుతామని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత బంధుతోనే ఆగిపోం.. ఎన్నో కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. అట్టడుగున ఉన్నందునే దళితుల కోసం మొదట కార్యక్రమం చేపట్టాం. దళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పాటునిస్తుందని సీఎం కేసీఆర్ న్నారు. ఈ పథకం ద్వారా సంపద సృష్టి జరుగుతోందని, 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుందని అన్నారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలని, గౌరవాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. 'ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, బాధ్యత గల పార్టీ అద్యక్షుడిగా, ఒక సీఎం గా భారత ఎన్నికల సంఘానికి ఒక సలహా ఇస్తున్నాను. చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాను' అని సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సభ పెట్టొద్దంటూ హైకోర్టులో కేసులు వేశారు. హుజూరాబాద్ లో సభ నిర్వహించొద్దంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసీ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దళితబంధు అమలు జరిగి తీరుతుంది. నవంబర్ 4 వరకు దళిత బంధు అమలును ఈసీ ఆపగలదు. హుజూరాబాద్లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతాడు. గెల్లు శ్రీనివాస్ ను హుజూరాబాద్ ప్రజలు దీవించి, ఆశీర్వదిస్తారు. రాష్ట్రమంతటా దళిత బంధును అమలు చేస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.