byసూర్య | Mon, Oct 25, 2021, 06:25 PM
టీఆర్ఎస్ ప్లీనరీలో దళిత బంధుపై వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని దళితులందరూ తన బంధువులే అని తెలుపుతూ.. దళిత బంధు పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గత పాలకులు దళితులను పట్టించుకోలేదు. దళితుల బాధలను చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్.. దళిత బంధు పథకానికి అంకురార్పణ చేశారు. ప్రతి ఇంట్లో సంక్షేమం ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెడుతున్నారు. దళితుల వద్ద పెట్టుబడి లేకనే వెనుకంజలో ఉన్నారు.
దళితులు అత్యంత వివక్షను ఎదుర్కొన్నారు. ఉపాధి, ఉద్యోగాలు దళితులకు అందలేదు. ఇప్పటికీ కడుపునిండా తినని దళితులు ఉన్నారు. నిరక్ష్యరాసులు కూడా దళితుల్లోనే ఎక్కువ ఉన్నారు. ఈ దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. భారతదేశానికే ఈ పథకం దిక్సూచిగా మారబోతుందన్నారు. సంపన్న వర్గాలను, అణగారిన వర్గాలను సమాన స్థితికి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. శ్రమించే పని చేసే జాతి దళితజాతి అని ఆనంద్ పేర్కొన్నారు.